Check dams are being blown up for the sake of sand mining: ఇసుక దందా కోసమే చెక్‌డ్యాంల పేల్చివేత

పెద్దపల్లి: కాంగ్రెస్‌ నాయకులు ఇసుక దందా కోసమే మానేరులోని చెక్‌డ్యాం పేల్చివేశారని మంథని మాజీ ఎమ్మెల్యే పుట్ట మధూకర్‌ ఆరోపించారు. బుధవారం కొట్టుకుపోయిన అడవిసోమన్‌పల్లి మానేరు చెక్‌డ్యాంను గురువారం ఆయన పరిశీలించి మాట్లాడారు. ఇక్కడ చెక్‌డ్యాం కట్టొద్దని మంథని ఎమ్మెల్యే శ్రీధర్‌ ప్రెస్‌మీట్లలో చెప్పారని గుర్తుచేశారు. ఈక్రమంలో.. చెక్‌డ్యాం ఉంటే ఇసుక తీసుకోవడం ఇబ్బందిగా ఉంటుందని భావించి కాంగ్రెస్‌ నాయకులు పేల్చివేసినట్లు కనిపిస్తోందని ధ్వజమెత్తారు. 12 లక్షల క్యూసెక్కుల వరద ప్రవాహాన్ని కూడా తట్టుకుని నిలబడిన చెక్‌డ్యాం.. లక్ష్య క్యూసెక్కుల నీటి నిల్వకు ఎలా కొట్టుకుపోతుందో కాంగ్రెస్‌ నాయకులే సమాధానం చెప్పాలని ఆయన డిమాండ్‌ చేశారు. మంథని ఎమ్మెల్యేకు చిత్తశుద్ధి ఉంటే విచారణ జరిపి దోషులను శిక్షించాలని, చెక్‌డ్యాం పునర్మించాలని ఆయన డిమాండ్‌ చేశారు. నాయకులు ఏగోళపు శంకర్‌గౌడ్, తగరం శంకర్‌లాల్, కనవేన శ్రీనివాస్, మాచిడి రాజుగౌడ్, సంపత్, నాగరాజు, నరేందర్‌ తదితరులు పాల్గొన్నారు. కాగా.. అడవిసోమన్‌పల్లి చెక్‌డ్యాంను త్వరలో పరిశీలిస్తానని మాజీమంత్రి హరీశ్‌రావు తెలిపారు. చెక్‌డ్యాం క్షేత్రస్థాయి పరిస్థితిని మధూకర్‌ వీడియో కాల్‌ ద్వారా ఆయనకు చూపించడంతో స్పందించారు.