బయట చెత్త వేస్తే జరిమానా వేస్తాం

రామగుండం: బహిరంగ ప్రదేశాల్లో చెత్త వేసినా, నిషేధిత ప్లాస్టిక్‌ వినియోగించినా జరిమానా విధించాలని రామగుండం నగరపాలక సంస్థ కమిషనర్‌(ఎఫ్‌ఏసీ) అరుణశ్రీ ఆదేశించారు. నగరపాలక సంస్థ కార్యాలయంలో సోమవారం పారిశుధ్య పర్యవేక్షకులు, నీటిసరఫరా, మెప్మా సిబ్బంది, వార్డు అధికారులతో వేర్వేరుగా సమీక్షించారు. రోడ్లు, కాలువలు, ఓపెన్‌ ప్లాట్లలో చెత్తవేస్తే జరిమానా వసూలు చేయాలన్నారు. ఇంటింటా తడి, పొడిచెత్త వేర్వేరుగా సేకరించాలని, మురుగునీటి కాలువల్లో పూడికతీత, స్ప్రే, ఫాగింగ్, ఆయిల్‌ బాల్స్‌ వేయాలని ఆదేశించారు.
స్వచ్ఛ ఆటోలు పూర్తిసామర్ధ్యంతో రెండుసార్లు డంపింగ్‌ యార్డ్‌కు వెళ్లాలన్నారు. జ్వరాలు ప్రబలే ప్రాంతాల్లో పారిశుధ్య పనులు మెరుగుపర్చాలని అన్నారు. ఒకేఇంటికి రెండు నల్లా కనెక‌్షన్లు ఉంటే ఒకటి తొలగించాలని ఆదేశించారు. పైప్‌లైన్‌ లీకేజీలను వెంటనే మరమ్మతు చేయించాలని పేర్కొన్నారు. ప్రతీ ఉపరితల ట్యాంక్‌ ఆవరణను పరిశుభ్రంగా ఉంచి మొక్కలు నాటాలని ఆదేశించారు. 18ఏళ్ల వయసు నిండిన నిరుపేద మహిళలతో కొత్త స్వశక్తి సంఘాలు, సమాఖ్యలు ఏర్పాటు చేయాలని చెప్పారు. వన మహోత్సవాన్ని విజయవంతం చేయాలన్నారు. వీధివ్యాపారులను గుర్తించాలన్నారు. ఆస్తిపన్ను, లైసెన్స్‌ రుసుం వసూలయ్యేలా వినియోగదారులను చైతన్యపరచాలని సూచించారు. డిప్యూటీ కమిషనర్‌ వెంకటస్వామి, ఎగ్జిక్యూటివ్‌ ఇంజినీర్‌ రామన్‌ తదితరులు పాల్గొన్నారు.