మత్తుపదార్థాలను కట్టడి చేయాలి

సిరిసిల్ల: మత్తు పదార్థాలను కట్టడి చేయాలని కలెక్టర్‌ సందీప్‌ కుమార్‌ ఝా కోరారు. కలెక్టరేట్‌లో ఎస్పీ మహేశ్‌ బీ గీతేతో కలిసి శనివారం నార్కోటిక్‌ కంట్రోల్‌ సమావేశం నిర్వహించారు. కలెక్టర్‌ మాట్లాడుతూ డ్రగ్స్, మాదకద్రవ్యాలతో కలిగే నష్టాలపై జిల్లాలోని అన్ని విద్యాసంస్థల్లో వైద్యాధికారులతో అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని సూచించారు. విద్యాసంస్థలకు 100 గజాల పరిధిలో తంబాకు, మద్యం విక్రయాలను నిషేధిస్తున్నట్లు తెలిపారు. వినాయక నిమజ్జనం సందర్భంగా మద్యంషాపులు మూసివేయాలని ఆదేశించారు. గంజాయి సాగుచేసే రైతులకు ప్రభుత్వం నుంచి వచ్చే అన్ని రకాల సహాయాన్ని రద్దు చేయాలని తెలిపారు. ఆస్పత్రులు, మెడికల్‌షాపుల్లో స్టాక్‌ వివరాలను తనిఖీ చేయాలని డ్రగ్‌ ఇన్‌స్పెక్టర్‌కు సూచించారు. ఆర్డీవోలు వెంకటేశ్వర్లు, రాధాబాయి, డీఈవో వినోద్‌కుమార్, డీఏవో అఫ్జల్‌బేగం, మున్సిపల్‌ కమిషనర్లు ఖదీర్‌పాషా, అన్వేశ్‌, ఎక్సైజ్, ఇరిగేషన్, లేబర్, ఫుడ్‌ ఇన్‌స్పెక్టర్‌, డ్రగ్‌ ఇన్‌స్పెక్టర్‌, డీఐఈవోలు పాల్గొన్నారు.
మట్టి గణపతులను పూజించాలి
పర్యావరణ హితమైన మట్టి గణపతి విగ్రహాలను పూజించాలని కలెక్టర్‌ సందీప్‌కుమార్‌ ఝా కోరారు. కలెక్టరేట్‌లో పొల్యూషన్‌ కంట్రోల్‌బోర్డ్‌ రూపొందించిన పోస్టర్‌ను ఆవిష్కరించారు. పొల్యూషన్‌ కంట్రోల్‌ బోర్డ్‌ 2వేల మట్టి గణపతి విగ్రహాలు పంపిణీ చేస్తున్నట్లు తెలిపారు. ప్లాస్టర్‌ ఆఫ్‌ ప్యారీస్‌కు బదులుగా మట్టి విగ్రహాలను పూజించాలన్నారు. పొల్యూషన్‌ కంట్రోల్‌బోర్డ్‌ అసిస్టెంట్‌ సైంటిస్ట్‌ జ్యోతి, కలెక్టరేట్‌ పర్యవేక్షకులు ప్రవీణ్, రాంచందర్, తహసీల్దార్‌ ఫారూక్‌ పాల్గొన్నారు.