జగిత్యాల: తెలంగాణ ప్రజల మనోభావాలను దెబ్బతినేలా వ్యాఖ్యలు చేసిన ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ బేషరతుగా క్షమాపణ చెప్పాలని తెలంగాణ మంత్రి అడ్లూరి లక్ష్మణ్కుమార్ డిమాండ్ చేశారు. మల్యాల మండలం ముత్యంపేటలోని కొండగట్టు ఆంజనేయస్వామి ఆలయంలో బుధవారం మంత్రి స్వామివారిని దర్శించుకున్నారు. ఆలయ అర్చకులు ఆయనకు ఘన స్వాగతం పలికారు. అనంతరం మంత్రి అడ్లూరి లక్ష్మణ్కుమార్ మీడియాతో మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ వ్యాఖ్యలు తెలంగాణ ప్రజల మనోభావాలను దెబ్బతీశాయన్నారు. కోనసీమ విపత్తు సంభవిస్తే తెలంగాణకు ఏం సబంధమని ప్రశ్నించారు. ప్రజలను తప్పుదోవ పట్టించేలా వ్యాఖ్యలు చేయడం సరికాదన్నారు. కళాకారులు అభిమానుల మనస్సు నొప్పించే వ్యాఖ్యలు చేయడం తగదన్నారు. తెలంగాణ ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో అభివృద్ధి, సంక్షేమ రంగాల్లో దూసుకుపోతోందన్నారు. ప్రాంతాల వారీగా సమస్యలు తెలుసుకుంటూ, పరిష్కరించేందుకు కృషి చేస్తున్నామని మంత్రి అడ్లూరి లక్ష్మణ్కుమార్ పేర్కొన్నారు.

